27, జనవరి 2025, సోమవారం

తేటగీతి: అప్పు చేయకు ఆడంబరాల కొఱకు

 

అప్పు చేయకు, ఆడంబరాల కొఱకు,
తప్పు చేయకు, సంబరాల కొఱకు, మరి
వినక చేసిన ముప్పువాటిల్లు, పట్టు
నీకు జీవితకాలంబు తేరుకొనగ!

-శివ భరద్వాజ్

Meaning: Don't borrow for the sake of show, don't make mistakes for the sake of temporary enjoyment, happiness and celebration, and If we do so, we will throw our life into problems, some times we can not overcome that problems in our life time.

25, జనవరి 2025, శనివారం

🔱 అంతర్యామి 🔱

 శ్రీ రామ జయ రామ జయజయ రామ:
🔱 అంతర్యామి 🔱

# బుద్ధి సూక్ష్మత...

🍁సబ్బునీటితో బుడగ సృష్టించి సంబరపడటం చిన్నతనం. మనిషి జీవితం నీటి బుడగన్నది గ్రహించడం పెద్దరికం. ఆటబొమ్మగా చిన్నకారును చూసి సంబరపడే పిల్లాడికి, కారు కొనుక్కుని దాన్ని వివిధ భంగిమల్లో చూసి మురిసిపోయే పెద్దవారికి తేడా ఏమీ లేనట్టే! అవసరార్థం వనరులు సమకూర్చుకోవడం వేరు, ఆడంబర ప్రదర్శనకు వస్తువులను ఏర్పాటు చేసుకోవడం వేరు. మనసు కన్నా బుద్ధి శక్తిమంతమైనది అంటోంది గీత. బుద్ధి పదునవుతున్నకొద్దీ మనసు దానంతటది నియంత్రితమవుతుంది. వయసుతో పాటు బుద్ధి వికసించాలి. ఆలోచనల్లోని పరిణతి ఆచరణలో కనిపించాలి. వ్యక్తిత్వవికాసం అంటే అది!

🍁జ్ఞానం మూడు స్థితులలో పనిచేస్తుంది. మొదటిది అంతః ప్రేరణ తెలివి, రెండోది సహజ జ్ఞానం (ఇదే బుద్ధి)- బాహ్య ఉపకరణాల ద్వారా నేర్చుకోవడం, పరిసరాలూ-పరిస్థితుల నుంచి గ్రహించడం వల్ల కాకుండా సహజసిద్ధంగా హృదయ లోతుల నుంచి ఉద్భవిస్తుంది. ఇదే వాస్తవమైంది. దీన్నే శాస్త్రాల్లో బుద్ధి, ధీః, హృదయకమలం, జ్ఞాననేత్రం అంటారు ఈ సహజ జ్ఞానం ఉద్దీపనం అవడమే బుద్ధియోగం అన్నది గీతాప్రవచనం. పవిత్ర హృదయంతో, ప్రార్థనలతో, గాయత్రి వంటి మంత్రజపాలతో బుద్ధిసూక్ష్మత పొందడం మూడోది. బుద్ధి పరిధిని పెంచుకుంటూ, మనసు ప్రమేయాన్ని నామమాత్రం చేసుకుని ఆత్మజ్ఞానం పొందడం మానవజన్మ లక్ష్యం. జాగృతి చెందిన బుద్ధిని సారథిగా చేసుకొన్న వ్యక్తి భగవంతుడి సాన్నిధ్యాన్ని తేలిగ్గా చేరతాడు.

🍁మందబుద్ధి సారథ్యంలోని వ్యక్తి గమనం లౌకికతతో కొట్టుమిట్టాడుతూ అగమ్యగోచరమవుతుంది అన్నది. కఠోపనిషత్తు వాక్యం. కర్తవ్యసాధనలో  తలమునకలయ్యే సాధకుడు వ్యక్తులతో, వస్తువులతో సంబంధాలు పెంచుకోడు. వివిధ దశల్లోని భవబంధాలను, వస్తువుల పట్ల ఆపేక్షను ఎప్పటికప్పుడు తేలిగ్గా వదిలించుకుంటూ కడపటి గమ్యం చేరతాడు. చెట్టు నుంచి పచ్చని ఆకును, దోర కాయను, విరబూసిన పువ్వును విడదీయడానికి బలం కావాలి. కానీ పండిన ఆకు, కాయ, పరిపూర్ణంగా వికసించి ఎండిన పువ్వు సులువుగా నేలరాలి మట్టిలో కలిసిపోతాయి. ఒక్కోదానికి ఒక్కో చివరి దశ ఉంటుంది. అక్కడికి చేరుకున్నాక అనీ విడిపించుకుని మనసును, శరీరాన్ని తేలిక చేసుకోవాలి.

🍁గొంగళిపురుగు తన చుట్టూ తానే గూడు అల్లుకుని, దాంట్లో బందీ అవుతుంది. అందులోనే ఉండి అది ఎంత రోదించినా దానికి సాయం చేయడానికి ఎవరూ రారు. చివరికి అదే జ్ఞానం పొంది, అందమైన సీతాకోకచిలుకలా బయటికి వస్తుంది.

🍁ప్రాపంచిక బంధాలకు సంబంధించి మనిషి పరిస్థితీ ఇదే. వ్యామోహాలను ఛేదించుకుని మోక్షం సాధించాలి. ఉన్నతమైన జీవితం గడపాలంటే శరీరాన్ని, ఇంద్రియాలను తదనుగుణంగా మలచుకోవాలి. మనసు కోరికలకు ఆజ్యం పోస్తుంది.

🍁కృత్రిమ వస్తువులపట్ల మొదట ఆకర్షితమై, తర్వాత్తర్వాత దాసోహమై చివరికీ అదే జీవితమన్న భ్రమకు లోనవుతుంది. ఆ మాయలోంచి బయట పడగలిగిన మానవ జన్మే ధన్యమవుతుంది.🙏

✍️-ప్రతాప వెంకట సుబ్బారాయుడు
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

19, జనవరి 2025, ఆదివారం

డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే!

 డబ్బు ఉంటే సుఖమే, ఇది నిజమే!
డబ్బు చేసిన మనిషి,
జబ్బు చేసిన మనిషి ఒకటే, ఇదీ నిజమే!
పడవ పయనం సాగాలంటే,
నీటి అవసరం నిజమే!
పడవలోకి నీరు పయనిస్తే,
పడవ పయనం ముగుస్తుంది, ఇదీ నిజమే!

-శివ భరద్వాజ్

16, జనవరి 2025, గురువారం

🔱 అంతర్యామి 🔱

 శ్రీ రామ జయ రామ జయజయ రామ:
🔱 అంతర్యామి 🔱

# భక్తి పారవశ్యాo...

🍁దైవభక్తి, మాతృభక్తి, పితృభక్తి, గురుభక్తి... భక్తికి రూపాలు. ఏ భక్తి అయినా పూర్తి విశ్వాసంతో స్థిరంగా ఉండాలి. భగవంతుడు పూజలకు, జపతపాలకు, అభిషేకాలకు పొంగిపోననీ, నిష్కల్మషమైన భక్తికి లొంగిపోతాననీ అనేక సందర్భాల్లో చెప్పాడు. భక్తులకు కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు ఉండకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఆంజనేయుడు, ప్రహ్లాదుడు, మార్కండేయుడు, ధృవుడు, నారదుడు, అంబరీషుడు మొదలైన వారు అచంచలమైన భక్తికి మారు రూపాలు.

🍁భగవంతుడి మాయ ఆయనకి తప్ప వేరెవ్వరికీ అర్థం కాదు. ఆయన భక్తులకు చిన్న, చిన్న పరీక్షలు పెడుతుంటాడు. వాటికి తట్టుకుని నిలబడటం సంపూర్ణ భక్తి ప్రపత్తులు కలవారికి మాత్రమే సాధ్యం. అచంచల, నిష్కల్మష, నిస్వార్థ భక్తికి అర్ధం చెప్పే అద్భుతమైన సంఘటన ఒకటి భాగవతంలో ఉంటుంది. ఒకసారి కృష్ణ పరమాత్మకి భరించలేని తలనొప్పి వచ్చింది. ఎవరికీ చెప్పకుండా మౌనంగా బాధని భరిస్తున్నాడు. ఆయన భార్యలకు విషయ తెలిసి ఎన్నో ఉపచారాలు చేశారు. కానీ ఫలితం శూన్యం. పరమాత్ముడి బాధను చూసి వారంతా తల్లడిల్లిపోయారు. రాజ వైద్యులను పిలిపించారు. వాళ్లూ అనేక రకాల చికిత్సలు చేశారు.

🍁కృష్ణపరమాత్మ బాధ మాత్రం తగ్గలేదు. నారద మహర్షి, పలువురు మునులు, దేవతలు వచ్చారు. వారూ ఏమీ చేయలేకపోయారు. సృష్టి, స్థితి, లయ కర్త అయిన పరమాత్ముడికి వచ్చిన బాధని ఎవరు తగ్గించగలరు? నివారణోపాయం ఆయనకి తప్ప ఎవరికి తెలుసు? శ్రీకృష్ణ పరమాత్మ భార్యలు, ఆ బాధ తగ్గే విధానం చెప్పమని ఆయననే ప్రార్థించారు. తన భక్తులు ఎవరైనా వారి పాదధూళిని తన శిరస్సుపైన ఉంచితే, తలనొప్పి తగ్గుతుందని చెప్పాడాయన. ఆ మాటకి చుట్టూ ఉన్నవారంతా నిర్ఘాంతపోయారు. తమ పాదధూళి భగవంతుని శిరస్సుపై ఉంచడమా? ఎంత పాపం!? రౌరవాది నరకాలలో పడిపోతాం... అనుకున్నారు. అందరూ ముక్తకంఠంతో అటువంటి మహా పాపానికి పాల్పడలేమన్నారు. మీ ఇష్టం అన్నట్టుగా శ్రీకృష్ణపరమాత్మ తల పట్టుకుని బాధపడసాగాడు.

🍁తమ ప్రియసఖుడు బాధ పడుతున్నాడనే వార్త గోపికలకి తెలిసింది. పరుగున వచ్చారు. ఆయన బాధను చూసి కన్నీరుమున్నీరయ్యారు. వారికి అక్కడున్న వారు విషయం చెప్పారు. కానీ భగవంతుని శిరస్సుపై పాదధూళి ఉంచడం మహా పాపమని హెచ్చరించారు. దానికి గోపికలు తమను కోట్ల జన్మలవరకు పాపాలు వేధించినా పరవాలేదనీ, స్వామి బాధ తగ్గితే చాలనీ, తమ పాదధూళిని శ్రీకృష్ణ పరమాత్మ తలపై ఉంచారు. అది గోపికల భక్తి పారవశ్యానికి పరాకాష్ఠ. క్షణంలో ఆయన నొప్పి మటుమాయమయ్యింది. ఆయన బాధ కేవలం మాయ అని, భక్తులని పరీక్షించడానికి ఆడిన నాటకమని అందరికీ తెలిసింది. గోపికలు సంతోషంతో పొంగిపోగా మిగిలినవారంతా తలదించుకున్నారు.🙏

✍️-ఎం.వి.ఎస్.ఎస్. ప్రసాద్

⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

10, జనవరి 2025, శుక్రవారం

🔱 అంతర్యామి 🔱

 శ్రీ రామ జయ రామ జయజయ రామ:
🔱 అంతర్యామి 🔱

# సమయం రావాలి!...

🍁ఒకసారి ఓ సాధువు శిష్యులతో ఓ గ్రామంలో బస చేసి అక్కడి ప్రజల సమస్యలను తెలుసుకుంటూ, పరిష్కార మార్గాలను సూచిస్తున్నాడు. అది తెలిసి పొరుగూరి రామయ్య, భీమయ్య ఆయన దగ్గరకు వచ్చారు. తమ గోడు విన్నవించుకున్నారు.
'మమ్మల్ని దరిద్రం పట్టిపీడిస్తోంది. మాకు నిధి నిక్షేపాలక్కరలేదు. మనులు మాన్యాలక్కరలేదు. కడుపునిండా తిండి దొరికే మార్గం చూపండి
స్వామీ!' అని వేడుకున్నారు. సాధువు సంచిలోంచి ఒక పొట్లం తీసి, దాంట్లోంచి రెండు విత్తనాలు ఇద్దరికీ ఇచ్చాడు. 'వీటిని తీసుకెళ్లి నాటండి. మొక పెరిగి మధురఫలాలను ఇస్తుంది. వాటి రుచి అమోఘం. మంచి ధర పలుకుతుంది. మీకు ఆస్తులు గడించి పెట్టకపోయినా, ఆకలిబాధ లేకుండా ఆదుకుంటుంది' అన్నాడు. వాళ్లు సంతోషించారు.

🍁తిరిగెళ్లాక నేల చదును చేసి విత్తనం నాటి నీళ్లు చల్లారు. నాటిన దగ్గర్నుంచీ రామయ్య గింజ ఎప్పుడు మొలుస్తుందా అని ఎదురు చూసేవాడు. వారమైంది, పదిరోజులైంది. మొలక రాలేదు. తవ్వి చూస్తే విత్తనం అలాగే కనిపించింది. ఇంకేం మొలకెత్తుతుందని కోపంగా తీసి పారేశాడు. మరో వారం తరవాత భీమయ్య పాతిన గింజ మొలిచి చకచకా ఎదిగి కాపు పట్టింది. మధురమైన ఆ పండ్లను అమ్మి సొమ్ము చేసుకుంటున్న భీమయ్యను చూసి తాను ఆ అవకాశాన్ని కోల్పోయినందుకు రామయ్య బాధపడ్డాడు. గుడ్డు నుంచి కోడిపిల్ల రావటానికి 21 రోజులు పడుతుంది. గర్భంలోని శిశువు భూమ్మీద పడటానికి తొమ్మిది నెలలు పడుతుంది. ఏ పనులు నెరవేరాలన్నా కొంత సమయం పడుతుందన్న ఇంగితజ్ఞానం లేకపోతే ఫలితం అనుభవించక తప్పదు.

🍁ఒక్కోసారి మనం పడిన కష్టానికి తగిన గుర్తింపు వెంటనే లభించదు. అలాంటప్పుడు కుంగిపోవడం, నిగ్రహం కోల్పోవడం తగదు. బాణభట్టారకుడనే మహాకవి పద్దెనిమిదేళ్లకే 'కాదంబరి' అనే గ్రంథం రాసి, రాజాశ్రయానికెళ్లాడు. అక్కడున్న పండితులు ఇతణ్ని హేళన చేశారు. 'కాదంబరి' అంటే కల్లు. కల్లు తాగితే రుచి తెలియదని రాజు భావించి పరిపక్వత లేదు, పొమ్మన్నాడు. బాధపడిన బాణుడు ఇంటికెళ్లి కోపంతో కావ్యాన్ని తగలెట్టాడు.

రెండురోజుల తరువాత కాళిదాసు వెళ్లి 'అబ్బాయ్, నీ కాదంబరిని మరోసారి వినిపించు' అంటే బాణుడు. తెల్లముఖం వేసి విషయం చెప్పాడు. 'సరేలే, నేను చెప్తా రాసుకో' అని ఏకసంధాగ్రాహి అయిన కాళిదాసు తాను విన్న కాదంబరిని ఉన్నదున్నట్లుగా అప్పజెప్పాడు. లేకపోతే కాదంబరి మనకు దక్కేది కాదంటూ బహుళ ప్రచారంలో ఉన్న కథ తొందరపాటు చర్యలు ఎంత నష్టం కలిగిస్తాయో చెబుతుంది.

🍁మరికొందరుంటారు... పర్యవసానం గురించి ఆలోచించకుండా తోచిన పని చేసేస్తారు. అవివాహిత అయిన కుంతి దుర్వాసుడిచ్చిన వరాన్ని ముందుచూపు లేకుండా ఆచరణలో పెట్టబట్టే కదా అంత కడుపుకోత అనుభవించింది. ఏ పనికైనా ముందు వెనకలు ఆలోచించి, సమయాసమయాలు చూసి నిర్ణయాలు తీసుకోవాలి.

✍️- పి. వి. బి. శ్రీరామమూర్తి
⚜️⚜️🌷🌷🌷⚜️⚜️⚜️
శ్రీ రామ జయ రామ జయజయ రామ
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

ఏకో దేవః - భగవంతుడొక్కడే

 ఓ భగవంతుడా! ఆదిశంకర పరంపరాగతమైన పీఠ జగద్గురువుల యందు ఎటువంటి ద్వేషము లేకుండా గౌరవించే సద్బుద్ధిని మాకు ప్రసాదించు. త్రిమతస్థులు ( స్మార్త, ...