7, సెప్టెంబర్ 2025, ఆదివారం

స్వదేశీ స్వాభిమాన శంఖాన్నే పూరించు

స్వదేశీ స్వాభిమాన శంఖాన్నే పూరించు,
విదేశీ శక్తులకు తలవొంచి నిలబడకు.  "స్వదేశీ"

నీ దేశపు సరుకులుండ ఇంకొకటి కొనబోకు 
విదేశీ వస్తువుల మోజులోన పడబోకు,
బెదిరింపులు ఇకమీద చెల్లబోవు చెల్లబోవు. 
బానిసత్వ బతుకులింక వద్దు మాకు వద్దుమాకు  "స్వదేశీ"

నీవద్ద లేనిదాన్ని తెచ్చుకో తప్పులేదు,
లగ్జరీల మాయలో పడిపోయి కొట్టుకోకు,
స్వచ్ఛమైన కొబ్బరీ నీళ్లుండగా కోకేందుకు,
నాటుకోడి పులుసుండగ kfc రుచులెందుకు   "స్వదేశీ"

శాశించే అధికారము డాలరుకి ఇవ్వబోకు 
బెదిరిస్తే రూపాయి బెదురునని చాటబోకు
ప్రజలంతా స్వదేశీ మంత్రాన్ని జపియిస్తే
ఎవరెస్టుకు చేరునోయి భారతీయ జీడీపీ   "స్వదేశీ"

-శివ భరద్వాజ్

  






6, సెప్టెంబర్ 2025, శనివారం

🔔 *అనగనగా...* 🔔

 🔔 *అనగనగా...* 🔔

ఒక సాధువు నడుస్తూ అలసిపోయి ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఎదురుగా ఉన్న ఇంటి యజమాని ఆయన్ని ఆహ్వానించి, విశ్రాంతి తీసుకోమని కోరాడు. భోజనం పెట్టి, చీకటి పడిందని ఆ రాత్రి తన ఇంట్లోనే ఉండమన్నాడు.

మాటల్లో యజమాని అన్నాడు:
👉 “సంసారంలో సుఖం లేదండీ! మీ జీవితం ఎంత హాయిగా ఉంది!”
అందుకు సాధువు ప్రశాంతంగా:
👉 “అయితే నా వెంట రా, నీకు మోక్ష మార్గం చూపిస్తాను.”
యజమాని తడబడుతూ:
👉 “అలా ఎలా సాధ్యం స్వామీ? పిల్లలు చిన్నవాళ్లు… వాళ్లను పెంచాలి కదా!” అన్నాడు.

⏳ సంవత్సరాలు గడిచాయి…
సాధువు మళ్లీ వచ్చాడు. యజమాని పిల్లలు పెద్దవాళ్లయ్యారు.
సాధువు: “ఇప్పుడైనా నా వెంట రా!”
యజమాని: “ఇంకా లేదు స్వామీ… పిల్లలు స్థిరపడాలి, పెళ్లిళ్లు చేయాలి.”

మరిన్ని సంవత్సరాలు గడిచాయి.
సాధువు మళ్లీ వచ్చాడు. యజమాని ఈ సారి కొంచెం విసుగ్గా:
👉 “పిల్లలకు డబ్బు విలువ తెలియదు. నేను దాచినంతా ఆ చెట్టు కింద పాతిపెట్టాను. ఇల్లు కట్టాలి… మీలాగా నాకు ఎలా కుదురుతుంది?” అన్నాడు.

🌑 మరికొన్ని సంవత్సరాలు గడిచాయి.
సాధువు మళ్లీ ఆ మార్గం గుండా వెళ్తుంటే యజమాని కనబడలేదు. అతని కొడుకు చెప్పాడు:
👉 “నాన్నగారు మరణించారు.”

సాధువు బయటికి వచ్చి చెట్టు కింద చూసాడు. అక్కడ ఒక కుక్క కూర్చుంది.
మంత్రజలం జల్లి అన్నాడు:
👉 “ఏమిటి నీ మోహం? కుక్కగా పుట్టి కూడా ఇంటిని కాపలా కాస్తున్నావా? నా వెంట రా, మోక్షం చూపిస్తాను.”
కుక్క (యజమాని ఆత్మ):
👉 “అలా చేయలేను… నేను దాచిన సొమ్ము పిల్లలకు చెప్పలేదు. అది ఎవరూ దోచుకోకుండా చూడాలి.”

కొన్నాళ్లకు ఆ కుక్క కనిపించలేదు. చెట్టు కింద ఇప్పుడు ఒక పాము.
సాధువు మంత్రజలం చల్లగా అది మాట్లాడింది:
👉 “నా సొమ్ము పిల్లలకే దక్కాలి, వేరెవరికి దక్కకూడదు. అందుకే ఇక్కడే ఉంటున్నాను.”

సాధువు ఇంట్లోకి వెళ్లి పిల్లలతో అన్నాడు:
👉 “మీ నాన్న ఆ చెట్టు కింద ధనం దాచాడు. కానీ జాగ్రత్త, అక్కడ పాము ఉంది.”

వెంటనే వారు కర్రలు పట్టుకొని అక్కడికి పరుగెత్తారు.
తన సొంత పిల్లలే తనను కర్రలతో కొడుతుంటే ఆ ఆత్మ సాధువును చూసి హాయిగా మొఱ్ఱ పెట్టింది… కానీ అప్పటికే చాలా ఆలస్యమైంది.

🌸✨ నీతి ✨🌸

👉 గృహస్థాశ్రమంలో బాధ్యతలు తప్పవు.
👉 కానీ మోహబంధాలు మరీ గట్టిగా కట్టేసుకుంటే అది ఇహపరముల రెండింటికీ అడ్డుపడుతుంది.
👉 సంపద, పిల్లలు, ఇల్లు – ఇవి అవసరం. కానీ పరమగమ్యం మరువకూడదు. 

27, ఆగస్టు 2025, బుధవారం

వినాయక చవితి శుభాకాంక్షలు

ఆకృతినీయ చెరువుల మట్టితో,
అలంకరింపఁగ ఓషధీ పత్రితో,
పూజఁచేయ గృహపుష్పాలతో,
నివేదింప ముదిత మోదకములతో.

నిమజ్జింపగ విగ్రహం నీటితో,
గ్రహించుడు తత్వం  బుద్ధితో,
వినాయక పూజ ప్రకృతి పూజయని,
తెలుసుకొనుడు హృదిన భక్తితో.

గణపతిపూజ గర్వ ప్రదర్శన కాదు,
సిద్ధి దాయిని బుద్ధి ప్రబోధమది,
విగ్రహం క్షణికమై, మట్టియై నీటిని లీనమగున్,
తత్వం శాశ్వతమై మనసున నిలుచున్.

వినాయకుని తత్వము తెలిసిన,
నిలుచును విజయం నీ పథమున,
సనాతన ధర్మపథ దర్శనమిది,
భక్తితో జ్ఞానప్రకాశ పాఠమిది.

— శివ భరద్వాజ్

25, ఆగస్టు 2025, సోమవారం

గణపతి పూజ

ఆకృతినీయుడు అవని మట్టితో,
అలంకరించుడు ఓషధీయ పత్రితో,
పూజచేయుడు నిజగృహ పూలతో,
నివేదించుడు ముదమున మోదకములతో, 
నిమజ్జనచేయుడు విగ్రహము నీటితో,
గణేశ తత్వమన ఘనమగు విగ్రహము కాదు,
ప్రకృతి ఆరాధనమని గ్రహించుడు భక్తితో,
గణపతిపూజ, అహంకార ప్రదర్శన కాదు,
బుద్ధిగా మసలిన సిద్ధి లభించునని తెలిపెడి,
సనాతన ధర్మ సంస్కృతియని తెలుసుకో. 

-శివ భరద్వాజ్

3, ఆగస్టు 2025, ఆదివారం

స్నేహమే జీవిత సారథి

పంచప్రాణాలే జీవితానికి పునాది,
ఆరోప్రాణం స్నేహమే దానికి సారథి. 

ఉపిరి లేని శరీరంలా, పంజరంలోని పక్షిలా,
స్నేహం లేని హృదయం, మౌనపు శిలలా.

చూపులే మాటలు, నవ్వులే గీతాలు,
స్నేహితుడే పాడు జీవిత రాగాలు.

ఆయువు కొలిచేది నాడుల శబ్దమే,
ఆయువు పెంచేది మిత్రుల శబ్దమే. 

జీవించడమే కాదు, జీవితం అనుభవించడమూ కళే,
ఆ కళకు రంగుల అద్దేది స్నేహ మాధుర్యమే.

జాతీయ స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు. 
-శివ భరద్వాజ్

1, ఆగస్టు 2025, శుక్రవారం

సత్సంగం - అంతరార్థం

 ఒక వ్యక్తి పట్టణంలో జరుగుతున్న సత్సంగానికి  ప్రతిరోజు వెళ్ళుతుండేవాడు.

ఆ వ్యక్తి ఒక చిలుకను పంజరములో ఉంచి పోషించేవాడు.

ఒక రోజు చిలుక తన యజమానిని అడిగింది, 'మీరు ఎక్కడకు రోజు వెళ్తున్నారు' అని?

అతను ఇలా అన్నాడు, "మంచి విషయాలు తెలుసుకోవడానికి నేను రోజూ సత్సంగానికి వెళతాను."

"మీరు నాకు ఒక సహాయం చేయగలరా?" అని అడిగింది ఆ చిట్టిచిలుక ఆ యజమానిని. "నేను ఎప్పుడు స్వేచ్ఛ పొందగలను అని మీ గురువు గారిని అడిగి చెప్పండి" అని.

మరుసటి రోజు, యజమాని సత్సంగానికి వెళ్ళాడు.

సత్సంగం ముగిసిన తర్వాత, అతను గురువు దగ్గరకు వెళ్లి, "మహారాజ్, నా ఇంటిలో ఒక చిలుక ఉంది, అది స్వేచ్ఛ ఎప్పుడు పొందగలదో మిమ్మలను అడిగి తెలుసుకోమని ప్రాధేయపడింది" అని.

అది విన్న వెంటనే, గురువుగారు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు.

ఇది చుాసిన చిలుక యజమాని భయపడి,నిశ్శబ్దంగా అక్కడ నుండి వెళ్ళిపోయాడు.

అతను ఇంటికి చేరుకొన్నాడు. అతని చిలుక అతనిని అడిగింది, 'మీరు నా ప్రశ్నను గురువుగారిని అడిగారా?' అని.

యజమాని బదులిచ్చాడు- 'నేను అడిగాను కానీ నీ అదృష్టం బాగాలేదు. నేను నీ ప్రశ్న అడిగిన వెంటనే, గురువుగారు అపస్మారక స్థితి లోకి వెళ్లిపోయారు' అని.

"సరే సరే, నేను అర్థం చేసుకున్నాను" అన్నది ఆ చిలుక.

మరుసటి రోజు సత్సంగానికి వెళ్తూ, యజమాని పంజరంలో ఉన్నచిలుక అపస్మారక స్థితిలో ఉండడాన్ని చూశాడు.

యజమాని పరీక్షగా చూసి చిలుక చనిపోయిందనుకుని  బయటకు తీసాడు. దానిని నేలమీద ఉంచాడు. వెంటనే ఆ చిలుక రివ్వుమంటూ ఎగిరిపోయింది. 

చేసేది లేక సత్సంగం కోసం మామూలుగా వెళ్లాడు ఆ యజమాని.

గురువు అతనిని చూసి, దగ్గరకు పిలిచి, "నీ చిలుక ఎక్కడ ఉంది?" అని అడిగాడు.

"నేను ఉదయం సత్సంగానికి వచ్చేటప్పుడు, నా చిలుక అపస్మారక స్థితికి గురై, పంజరంలో పడి ఉంది. దాని ఆరోగ్యం తనిఖీ చేయడానికి నేను పంజరం తెరిచి దానిని నేలమీద ఉంచినప్పుడు, అది పారిపోయింది" అని దిగులుగా చెప్పాడు.

గురువు నవ్వి, "మీ చిట్టిచిలుక మీ కన్నా ఎక్కువ తెలివిగలది. అది నేను ఇచ్చిన చిన్న సూచన అర్థం చేసుకుని ఆచరణలో పెట్టి స్వేచ్ఛను పొందగలిగింది.

కానీ మీరు చాలా రోజుల పాటు సత్సంగానికి వస్తూ కూడా సాధన చేయక, ఈ ప్రపంచంలోనే  భ్రమ అనే పంజరంలో చిక్కుకొని ఉన్నారు."

అని అన్నాడు.

యజమాని సిగ్గుతో తలదించు కొన్నాడు.

దూరం నుంచి చిలుక గురువుకు కృతజ్ఞతలు తెలుపుకుంది.

*నీతి :: సత్సంగం యొక్క ఉద్దేశం కేవలం భక్తికోసం కాదు, కాలక్షేపం కోసం కానే కాదు. అజ్ఞానం నుండి, అంధకారం నుండి, భ్రమ నుండి మనం బయటపడి స్వేచ్ఛగా విముక్తలమై దైవానికి చేరువకావడం కోసం అని గ్రహించాలి.

భజన అంటే ఏమిటి?

"భజన" అనే పదం సంస్కృత భాషలో "భజ్" అనే ధాతు నుండి వచ్చింది, దీని అర్థం "భక్తితో సేవ చేయడం", "పూజించడం", లేదా "గురించిచింతన చేయడం". భజన అంటే భగవంతుని నామస్మరణ చేయడం, గాత్రంతో లేదా వాద్యాలతో పాటలు పాడడం ద్వారా భక్తి వ్యక్తపరచడం. ఇది భక్తి మార్గంలో ఒక ముఖ్యమైన విధానం.

భజనలలో ఎక్కువగా భగవంతుని గుణగణాల గురించి, అవతారల చరిత్రలు, భక్తుల కధలు ఉంటాయి. ఇవి శ్రావణానందాన్ని కలిగిస్తూ, శ్రద్ధా-భక్తులను పెంచే విధంగా ఉంటాయి. భజనలో ప్రతి ఒక్కరు ఒక పాట పాడే విధముగా ప్రేరేపించాలి. సాధన చేసే ప్రయత్నం చేయాలి. భగవంతుని కృపకు అందరూ పాత్రులు కావాలి. 

భజనకు ఉండవలసిన లక్షణాలు:

భజన అర్థవంతంగా, శ్రద్ధగా ఉండాలంటే కొన్ని ముఖ్యమైన లక్షణాలు పాటించాలి:

    భక్తి:
    భజనలో అత్యంత ముఖ్యమైన లక్షణం భక్తి. మనస్పూర్తిగా, ఏకాగ్రతతో భగవంతుని పట్ల ప్రేమతో భజన చేయాలి.

   * శ్రద్ధ:*
    పాటల అర్థాన్ని అర్థం చేసుకుని, అందులోని తాత్పర్యాన్ని గ్రహించి, శ్రద్ధతో పాడాలి.

    శుద్ధ భావన:
    భజన స్వార్థరహితం, విశుద్ధమైన ఉద్దేశ్యంతో ఉండాలి. పొగరు, ప్రదర్శనల కోసం కాకుండా, అంతర్ముఖతతో జరగాలి.

    స్వర సరస్యత:
    భజన స్వరంలో సరళంగా, శ్రావ్యంగా ఉండాలి. వాద్యాలు, గానం కలసి హార్మోనిగా ఉండాలి.

    నామస్మరణ ప్రాధాన్యత:
    భజనలలో భగవంతుని నామము పదే పదే వచ్చేటట్లు ఉండాలి. నామస్మరణే భజనకు ప్రాణం.

    సమూహ భక్తి (సత్సంగ్):
    భజనలు తరచూ సమూహంగా చేస్తారు. ఇది సమూహంలో ఉన్న అందరికీ ఆధ్యాత్మిక ఉల్లాసాన్ని కలిగిస్తుంది.

    అనుసంధానం (కథన - గానం):
    భజనలలో గానం మధ్యలో చిన్న చిన్న వ్యాఖ్యానాలు, చివరిలో సత్సంగం ఉండడం వల్ల శ్రోతలకూ అవగాహన పెరుగుతుంది. అధ్యాత్మిక దృష్టికోణం అలవడుతుంది. సత్సంగం లేని భజన ఆత్మ లేని దేహం వంటిది.

    వినయము:
    భజన చేసే వారిలో వినయము ఉండాలి. తమ ప్రతిభను చూపించాలనే గర్వం కాకుండా, భగవంతుని సేవ భావన ఉండాలి.

ముగింపు:

భజన అనేది శుద్ధమైన హృదయంతో జరిగే ఒక భక్తి ప్రక్రియ. ఇది మనసుని శాంతింపజేస్తుంది, భగవంతుని సమీపానికి తీసుకెళ్తుంది. నిజమైన భజన భగవంతుని నామాన్ని, రూపాన్ని, మహిమను శ్రద్ధతో స్మరించడం మరియు భాగవతత్వాన్ని గ్రహించడం.

26, జులై 2025, శనివారం

పంచేంద్రియాల్లో ప్రమాదకరమైంది ఏది?

 పంచేంద్రియాల్లో ప్రమాదకరమైంది ఏది?* 

🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

కనిపించని ఏదో ఒక దివ్యశక్తి ఈ ప్రపంచాన్ని శాసిస్తోంది. ఆ శక్తినే దైవశక్తి అంటాం. అలాగే కనిపించని ఏదో శక్తి ఈ మనిషి జీవితాన్ని నడిపిస్తోంది. దాన్నే మనసు అంటాం. మనసు ఎక్కడుందో, ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు. మన శరీరంలో రక్తం ప్రవహించినంత కాలం ఆ మనసు ఆజ్ఞలు జారీ చేస్తూనే ఉంటుంది. మనం ఊపిరి తీస్తున్నంత కాలం, ఆ మనసు మనల్ని ఆడిస్తూనే ఉంటుంది.

మనసు సముద్రం లాంటిది. సముద్రం అనంతమైనది. అపారమైనది. లోతైనది. సముద్రంలో జలచరాలుంటాయి. జలసంపదలుంటాయి. అమృతం, హాలాహలం అక్కణ్నుంచే పుట్టాయంటాయి పురాణాలు. సముద్రంలోంచి ఉప్పెనలొస్తాయి. సముద్రం అందమైనది. కల్లోలమైనది. చెలియలికట్ట దాటనంతవరకు సముద్రంతో ఏ ప్రమాదం ఉండదు.

మనసూ అంతే! మనసు ప్రపంచాన్ని ఉద్ధరించగలదు. ప్రపంచాన్ని భస్మం చెయ్యగలదు. మనిషిలో సత్వగుణం అమృతం. సత్వగుణం పెంచుకుంటే మనిషి వల్ల సమాజానికెంతో మేలు జరుగుతుంది. తమోగుణం పెరిగితే జరిగేవన్నీ చెడ్డ పనులే!
నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. ప్రపంచంలో విషయాలన్నీ మనసును చేరతాయి.

మనిషికి కన్ను, ముక్కు, చెవి, నాలుక, చర్మం అనే పంచేంద్రియాలున్నాయి. ప్రపంచంలో ప్రతి దృశ్యాన్నీ కన్ను ఆకర్షిస్తుంది. అందమైన వస్తువులన్నీ సొంతం కావాలనుకుంటుంది. చెవి మంచి, చెడు శబ్దాలను వింటుంది. మంచిని మాత్రమే గ్రహించి, చెడును విడిచిపెట్టగలిగితే మనిషి ఉన్నతుడవుతాడు. ముక్కు సువాసనలే పీలుస్తుంది. దుర్వాసనలను ఎలాగూ పీల్చదు. జిహ్వ రుచులను కోరుతుంది. దీంట్లో తినరానివి తినకూడదని విడనాడితే మనసు నిర్మలమవుతుంది. చర్మం సుఖాన్ని కోరుతుంది. ఇలా పంచేంద్రియాలు మనిషి మనసును, మంచి చెడులవైపు ప్రేరేపిస్తాయి.

పంచేంద్రియాల్లో ప్రమాదకరమైనది నోరు. ఇది రెండు పనులు చేస్తుంది- తింటుంది, మాట్లాడుతుంది. రెండూ మితమైనప్పుడే మనసు సత్వ సంపన్నమవుతుంది. అప్పుడే సమాజ సేవ, ఆధ్యాత్మిక చింతన, అరిషడ్వర్గాల అదుపు పెరిగి మానవ జీవితానికి సార్థకత చేకూరుతుంది.

ధర్మరాజు జూదమాడాడు. ఆస్తిపాస్తులను, భార్యను పణంగా పెట్టాడు. పరాజితుడయ్యాడు. అతడిలో తప్పున్నా లోకం అతణ్ని పన్నెత్తు మాటనలేదు. కారణం ఆయన మనసు వెన్న లాంటిది. దానధర్మాలు చేస్తాడు. దైవభక్తి కలవాడు. దుర్యోధనుడు అసూయాపరుడు కావడం, ధర్మవ్యతిరిక్తమైన పనులు చెయ్యడంతో అతడు లోక నిందితుడయ్యాడు. కారణం అతడి మనసు. సకల శాస్త్ర పారంగతుడు, పరాక్రమశాలి, సకల సంపన్నుడు రావణుడు. మనసు చెడ్డతనం వల్ల లోకనిందకు గురయ్యాడు. రాక్షస కులంలో పుట్టినా విభీషణుడు మనసును ధార్మిక చింతన వైపు మళ్ళించడంతో లోకం అతణ్ని మెచ్చుకుంది. అందుకే మనసును అదుపులో ఉంచుకోకపోతే జీవితం కష్టాల కడలి తరంగాల సంక్షుభితం అవుతుంది. మనసును అదుపులో ఉంచుకుంటే ఆనందాల నందనవన సంశోభితమే అవుతుంది!

🚩 హరహర మహాదేవ శంభోశంకర 🚩

25, జులై 2025, శుక్రవారం

గర్విష్ఠి న్యాయవాది Vs చమత్కారి గురువు



ఒక గర్విష్ఠి న్యాయవాది తనకు చెందిన బావిని ఒక రిటైర్డ్ ఉపాధ్యాయుడికి అమ్మేశాడు. రెండు రోజుల తర్వాత న్యాయవాది అతని దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు:

"సార్, నేను మీకు బావిని అమ్మాను కానీ... దానిలో ఉన్న నీటిని కాదు. మీరు ఆ నీటిని వాడాలంటే, విడిగా చెల్లించాలి."

దానికి గురువు చిరునవ్వుతో ఇలా స్పందించాడు:

"నిజమే నాయనా! నేను కూడా ఇప్పుడు మీ దగ్గరకే రాబోతున్నాను. మీరు నా బావి నుండి పూర్తిగా మీ నీటిని ఖాళీ చేయాలి.  లేకుంటే, మీరు నా బావిలో నీరు నిల్వ చేసినందుకు, రేపటి నుండి నాకు అద్దె చెల్లించాలి అని చెప్పడానికి!"

ఈ మాటలు విని న్యాయవాది కంగారుపడి, తడబడుతూ చెప్పాడు:

"అరే సార్, నేను సరదాగా అన్నాను!"

గురువు మళ్లీ చిరునవ్వు చిందిస్తూ అన్నారు:

"నాయనా, నీ లాంటి ఎంతో మందికి పాఠాలు చెప్పి, వారిని న్యాయవాదులుగా తయారు చేశాను! కానీ తెలివిగా ఉండడం అందరూ నేర్చుకోవాల్సిందే!"

ఎంతైనా గురువు గురువే..! 🙏

స్వదేశీ స్వాభిమాన శంఖాన్నే పూరించు

స్వదేశీ స్వాభిమాన శంఖాన్నే పూరించు, విదేశీ శక్తులకు తలవొంచి నిలబడకు.  "స్వదేశీ" నీ దేశపు సరుకులుండ ఇంకొకటి కొనబోకు  విదేశీ వస్తువు...